ముందస్తు ఎన్నికలపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన
ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్రంలో ముందస్తూ ఉండదు.. వెనకస్తూ జరగదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు.
ముందస్తూ అంటూ మాజీ పీసీసీ కలలు కంటున్నారని, ఆ కలలు అన్ని పగటి కలలేనని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల శాఖా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీలు, ట్రై సైకిల్లు, లాప్ టాప్ లతో పాటు 4జీ ఫోన్ లను మంత్రి జగదీశ్ అందజేశారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. దివ్యాంగులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి రూ.1500 రూపాయల ఫించన్ అందించారన్నారు. రెండో మారు అధికారంలోకి రాగానే వారి ఫించన్ ను రూ.3000 లకు పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
అంగ వైకాల్యతను అధిగమించి మిగితా వారితో పోటీ పడేలా మానసికంగా సిద్ధపరచడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. అటువంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ఆయన కాంగ్రెస్, బీజేపీలను సూటిగా ప్రశ్నించారు. ప్రధానికి ముందు ఏకధాటిగా 25 ఏండ్లు బీజేపీ ఎలుబడిలో ఉన్న గుజరాత్ లో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలులో లేవన్నారు. మోడీ ఎలుబడిలో సంక్షేమం ఉండదు… అభివృద్ధి జరుగదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ కు బీజేపీ 100 మైళ్ల దూరంలో ఉందన్నారు. అది అందుకోవడం ముమ్మాటికీ గగనకుసుమమేనన్నారు. 25 ఏండ్ల పాలనలో గుజరాత్ లో ఇంటింటికి మంచినీరు అందించలేని వారు ఇక దేశాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని ఆయన నిలదీశారు.
అభివృద్ధి మీద చర్చకు బీజేపీ సిద్ధం అనుకుంటే అది ఢిల్లీ అయినా, గుజరాత్ గాంధీ నగర్కైనా తమ పార్టీ కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఉంటే చెప్పాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ లకు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాలీనా 3000 కోట్ల ప్రీమియం తో యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా సహజ మరణాలకు కూడా బీమా వర్తించేలా రైతుబీమా పెట్టింది నిజం కాదా అని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు పీడిత ప్రాంతంగా మార్చిన ఘనత ముమ్మాటికి కాంగ్రెస్దేనని, అంతే గాకుండా రెండు లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడేందుకు కారణం కూడా ఆ పార్టీదేనన్నారు. అటువంటి పాపాలనుమూట కట్టుకున్న కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే జిల్లా ప్రజలు పాతర పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 స్థానాలలో జెండా ఎగరేసేది టీఆర్ఎస్ పార్టీయోనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు పెరిగిన విశ్వసనీయతకు నాగార్జున సాగర్, హుజుర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు.