ధావన్, గిల్ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్(113 బంతుల్లో 81 నాటౌట్), శుబ్మన్ గిల్( 71 బంతుల్లో 82 నాటౌట్).. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెరుపులు మెరిపించారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అంతకముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ నమ్మకాన్ని నిజం చేస్తూ దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. 50 ఓవర్లు ఆడడంలో విఫలమైన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ చకాబ్వా 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఒక దశలో 107 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే కనీసం 150 పరుగుల మార్క్నైనా దాటుతుందా అన్న అనుమానం వచ్చింది. కానీ చివర్లో రిచర్డ్ నగర్వా 34, బ్రాడ్ ఎవన్స్ 33 పరుగులు నాటౌట్ ఆకట్టుకోవడంతో ఆ జట్టు 189 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు తీయగా,.. సిరాజ్ ఒక వికెట్ తీశాడు.