H3N2:పెరుగుతున్న H3N2 కేసులు, పుదిచ్చేరిలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ
దేశంలో పలు చోట్ల హెచ్3ఎన్2 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారు 7 మంది చనిపోవడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పుదిచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి కొనసాగుతున్నందున పది రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అన్ని పాఠశాలలో 8వ తరగతి వరకు సెలవులు ఇస్తున్నామని.. మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు పుదుచ్చేరిలో మార్చి 11 నాటికి 79 ఇన్ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి. . కేసుల సంఖ్య పెరిగితే చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇన్ఫ్లుయెంజా కేసులకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ ఇన్ఫ్లుయెంజా కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించాయి. జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయినట్టు అటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా తెలిపింది. ఈ సీజనల్ ఇన్ఫ్లుయెంజా కారణంగా కర్ణాటక, హరియాణా, గుజరాత్లో సహా పలు రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.