మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
నాపై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ ఇస్తే తప్పులేదు… కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. నా విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా నేను భావించడం లేదని, మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలన్నారు.
రాజ్యాంగబద్దంగా స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై నాకు గౌరవం ఉందని, ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్ పిలవగానే హాజరయ్యానన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చానని బండి సంజయ్ వెల్లడించారు. నా స్టేట్ మెంట్ ను మహిళా కమిషన్ రికార్డు చేసిందని ఆయన తెలిపారు. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సుహ్రుద్బావ వాతావరణంలో జవాబిచ్చానన్నారు.