మార్చి 25న ఇందిరా పార్క్ వద్ద ‘నిరుద్యోగ మహాధర్నా’
‘మా నౌఖరీ మాగ్గావాలె’ అనే నినాదంతో మార్చి 25న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగులతో ఈ దీక్షను నిర్వహించనుంది.
TSPSC పేపర్ లీకేజీలో కీలక పాత్ర ఉన్నందున మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, కేసును సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలన్న డిమాండ్లతో ఈ మహాధర్నా జరగనుంది.
TSPSC పేపర్ లీకేజీతో పాటుగా ఇతర అంశాలపై బండి సంజయ్ అధ్యక్షతన మార్చి 23న పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు తదితరులు పాల్గొన్నారు.