లక్ష రూపాయలకు, మూడు లక్షలు.. హైదరాబాద్లో వెలుగులోకి నకిలీ దందా.
హైదరాబాద్లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. లక్ష ఒరిజినల్ నోట్లకు మూడు లక్షలు నకిలీ నోట్ల చొప్పున నడుస్తోన్న అక్రమ దందాను పోలీసులు పట్టుకున్నారు.
దీంట్లో మొత్తం 13మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర రూ.30లక్షల విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు.
హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసుకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఇది లోకల్ గ్యాంగ్ కాతని, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఈ ఫేక్ కరెన్సీ ముఠా ఆపరేషన్స్ చేస్తోందన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకతోపాటు ఏపీలో ఫేక్ కరెన్సీని చెలామణి చేస్తున్నట్టు సీపీ కొచ్చారు. పట్టుకున్న వారిలో రాజేష్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. రాజేష్ ఓ ఇంటర్నేషన్ స్కూల్లో డ్యాన్స్ టీచర్గా పనిచేస్తున్నట్లు సమాచారం.
రాజేష్ లక్ష రూపాయలకు 5 లక్షల ఫేక్ కరెన్సీని కొనుగోలు చేసి వాటిని ఇతరులకు లక్ష ఒరిజినల్ కరెన్సీకి మూడు లక్షలు ఫేక్ కరెన్సీ ఇచ్చేలా రాకెట్ నడుపుతున్నాడు. సైబరాబాద్ పరిధిలో 2013 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 3,60,000 కరెన్సీ పట్టు పడిందని సీపీ తెలిపారు. రాజేష్ చెన్నైకి వెళ్లి ఫేక్ నోట్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఫేక్ నోట్స్ ఉదయం సమయాల్లో కాకుండా సాయంత్రం తర్వాత చిన్న వ్యాపారుల వద్ద మారుస్తున్నారు.
పాత నేరస్తులపై నిఘా పెట్టి ఈ ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజేష్, నిలేష్ అనే ప్రధాన నిందితులు సాయత్రం,రాత్రి వేళల్లో ఫేక్ నోట్స్ అమాయకుల దగ్గర సర్క్యులేట్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 30 లక్షల 68వేల 500 ఫేక్ నోట్స్, క్యాష్ 60వేల 500వందల నగదు,13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన అధికారులు, ఫేక్ నోట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.