బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన జన్మదినం రోజు నుంచి పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్కు ఇక నుంచి రెగ్యులర్గా రావాలని డిసైడ్ అయ్యారు.
దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఆయన గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజున పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు.
డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యేలు అదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 7న ఫామ్ హౌస్లో కేసిఆర్ జారిపడటంతోఆయన ఎడమ కాలు తుంటి విరిగింది. దీంతో హూటాహుటిన హైదరాబాద్ తరలించారు కుటుంబసభ్యులు. యశోదా హాస్పిటల్లో డాక్టర్లు కేసీఆర్ తుంటి రీ-ప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అప్పట్నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కొంత కుదుటపడటం.. కర్ర సహకారంతో నడుస్తుండటంతో.. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి మళ్లీ పొలిటికల్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 1న నేరుగా అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ ఛాంబర్లో ప్రమాణస్వీకారం చేస్తారు. ఇక ఇప్పటికే కేసీఆర్ను స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అసెంబ్లీలో ఎల్ఓపీ కార్యాలయాన్ని కూడా కేటాయించారు. అదే రోజు ఆయన అసెంబ్లీలోని కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికలను పార్టీ అధిష్టానం ఛాలెంజింగ్గా తీసుకుంది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమావేశాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడ్ చేస్తున్నారు. ఇక నుంచి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కెసీఆర్ రంగంలోకి దిగితే పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 17న తన పుట్టిన రోజు నుంచి ఇక రెగ్యులర్గా కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారని బీఆర్ఎస్ కేడర్ చెబుతోంది.